శ్రీకృష్ణ దేవరాయలు పంచ శతాబ్ది ఉత్సవాలు సోమవారం హైదరాబాదులోని రవీంద్రభారతిలో ప్రారంభమయ్యాయి. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రోశయ్య మాట్లాడుతూ... చరిత్రలో ఎందరో రాజులు పాలించారనీ, అయితే జనరంజక పాలనను అందించిన రాజులు మాత్రమే ప్రజల మనసులను గెలుచుకుని రారాజులుగా వెలుగొందుతారన్నారు.
ప్రజలు రెండు రకాల పాలనలను అందించినవారిని ప్రత్యేకించి గుర్తు పెట్టుకుంటారన్నారు. జనరంజక పాలన అందించే రాజులతోపాటు ప్రజాకంటకులైన రాక్షస రాజులను కూడా గుర్తుపెట్టుకుంటారన్నారు. అయితే ప్రజా అవసరాలను ఎప్పటికప్పుడు గ్రహిస్తూ ప్రజాహృదయాలను చూరగొన్న రాజును చరిత్ర సువర్ణాక్షరాలతో లిఖిస్తుందన్నారు.
శ్రీకృష్ణ దేవరాయలు కన్నడిగుడైనప్పటికీ తెలుగు భాషాభివృద్ధికీ, తెలుగు జాతి కీర్తిని నలుదిశలా వ్యాపింపజేశారన్నారు. అంతటి మహనీయుడైన రాయలవారి పట్టాభిషేక ఉత్సవాలను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాలను నెలరోజులపాటు జరపనుందని చెప్పారు. ముగింపు కార్యక్రమం అనంతపురం జిల్లాలోని పెనుగొండలో నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఆ తర్వాత భారత రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ మాట్లాడారు. తెలుగువారి సంస్కృతి ఎంతో ఘనమైనదని అన్నారు. ఇటువంటి ప్రశస్తమైన తెలుగు నేలను పరిపాలించిన శ్రీకృష్ణ దేవరాయలు ప్రజలకు అవసరమైన ఎన్నో ప్రయోజనకరమైన పనులు చేపట్టారన్నారు. రాయలువారు చేసిన కృషిని మరువకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయన పేరిట కార్యక్రమాలను నిర్వహించడం ఎంతో అభినందించదగ్గ అంశమనీ అన్నారు. |