తెలంగాణ ప్రాంతంలో జరిగే ఉప ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఏడు స్థానాల్లో ఈవీఎంలతోనూ, ఐదు సెగ్మెంట్లలో బ్యాలెట్ పద్దతిలో ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఐవీ.సుబ్బారావు తెలిపారు. ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడుతూ నామినేషన్ల ఉపసంహరణ గడువు సోమవారంతో ముగిసింది. మొత్తం 278 మంది అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో ఎన్నికల బరిలో 435 మంది ఉన్నారని ఆయన తెలిపారు.
అలాగే, 64 కంటే తక్కువ మంది అభ్యర్థులు పోటీలో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో ఈవీఎంలను వాడనున్నట్లు ఆయన తెలిపారు. మిగతా ఐదు స్థానాల్లో 64 కంటే ఎక్కువ మంది పోటీలో ఉన్నందున ఆయా స్థానాల్లో బ్యాలెట్ ద్వారా ఓటింగ్ నిర్వహించనున్నట్లు సుబ్బారావు తెలిపారు.
వచ్చే27వ తేదీన ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదింటి వరకు పోలింగ్ జరుగుతుందన్నారు. 30వ తేదీ ఉదయం కౌంటింగ్ ప్రారంభమవుతుందని ఐవీ వెల్లడించారు. ఎన్నికల ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి, ఉప ఎన్నికలకు కల్పించాల్సిన భద్రతపై మంగళవారం ఆయా జిల్లాల పోలీసు ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రతి నేత సహకరించాలన్నారు.
కాగా, ఈవీఎంల ద్వారా ఎన్నికలు జరిగే వివరాలను ఆయన వివరించారు. ఈ జాబితాలో నిజామాబాద్ అర్బన్, మంచిర్యాల, చెన్నూరు, సిర్పూర్, సిద్ధిపేట, వేములవాడ, ధర్మపురి, చెన్పూరు స్థానాలు ఉన్నాయి. అలాగే, ఐదు స్థానాల్లో బ్యాలెట్ పద్దతిలో పోలింగ్ నిర్వహిస్తామని తెలిపారు. ఈ జాబితాలో సిరిసిల్ల, ఎల్లారెడ్డి, హుజూరాబాద్, కోరుట్ల, వరంగల్ పశ్చిమ స్థానాలు ఉన్నట్టు ఐవీ సుబ్బారావు వెల్లడించారు. |