ఆరోసారి జిల్లా పర్యటనకు వస్తున్న ముఖ్యమంత్రి రోశయ్యకు స్వాగతం పలికేందుకు కాంగ్రెస్ నేతలు, అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. పోలీసు అధికారులు ఆయన పర్యటనకు భారీ బందోబస్తు ఏర్పాట్లు పూర్తి చేశారు. శుక్రవారం సాయంత్రానికి సర్వం సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు. శుక్రవారం ఉదయం నుంచి నగరంలో పోలీసుల హడావుడి కనిపించింది. అధికారులు రెండు దఫాలు సీఎం పర్యటించే మార్గాల్లో ట్రయల్ రన్ నిర్వహించారు.
హెలీకాఫ్టర్తో కూడా ట్రయల్ రన్ నిర్వహించింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచే కాక ప్రకాశం, నెల్లూరు జిల్లాల నుంచి భారీగా బలగాలను నగరానికి రప్పించారు. పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో ఎస్పీ చౌహాన్, సిబ్బందికి సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. సీఎం పర్యటన పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. నాగార్జున యూనివర్సిటీ నుంచి చిలకలూరిపేట రోడ్డులోని అపాచి కంపెనీకి శంకుస్థాపన చేసే ప్రాంతం వరకు, నగరంలోని వెంకటేశ్వర విజ్ఞాన మందిరం, అర్బన్ పోలీస్ కార్యాలయం వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.
ఆయా ప్రాంతాల్లో డాగ్ స్క్వాడ్లు తనిఖీలు నిర్వహించాయి. బందోబస్తులో సుమారు రెండున్నర వేల మంది పోలీస్ సిబ్బంది పాల్గొంటున్న నేపథ్యంలో నగరంలోని సిటీ బస్లను అధికారులు స్వాధీనం చేసుకొని ఆయా బస్సుల్లో సిబ్బందిని బందోబస్తు ప్రాంతాలకు తరలించారు. అదేవిధంగా అర్బన్ పోలీస్ కార్యాలయం ప్రారంభోత్సవానికి ముస్తాబైంది.
రాజకీయ, ప్రజా సంఘాల కదలికలపై నిఘా
సీఎం రోశయ్యను ఎవరైనా ఘెరావ్ చేయటం, అడ్డుకోవటం వంటి సంఘటనలకు పాల్పడే అవకాశం ఉందా అనే కోణంలో ఇప్పటికే నిఘా వర్గాలు దృష్టి సారించాయి. అపాచి కంపెనీకి భూములు ఇవ్వటాన్ని నిరశిస్తున్న ఎంసీపీఐ(యు) జిల్లా కార్యదర్శి తూమాటి శివయ్య, మహిళా కార్యదర్శి కటారి విజయ కుమారిలను శుక్రవారమే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. అదేవిధంగా సీపీఐ, ఏఐవైఎఫ్ కార్యకర్తలను కూడా అదుపులోకి తీసుకున్నారు. వివిధ రాజకీయ పార్టీలు, యువజన సంఘాల కార్యకర్తల కదలికలపై పోలీసులు దృష్టి సారించారు. |