పులివెందుల అసెంబ్లీ స్థానానికి జరుగనున్న ఉప ఎన్నిక కోసం దివంగత వైఎస్సార్ సతీమణి వైఎస్.విజయలక్ష్మి మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మంగళవారం మధ్యాహ్నం నామినేషన్ పత్రాలను స్థానిక రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. పులివెందుల ఎమ్మార్వో కార్యాలయంలో విజయలక్ష్మి తన నామినేషన్ పత్రాలను అందజేశారు.
ఆమె వెంట కడప ఎంపి, తన కుమారుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి, మరిది, ఎమ్మెల్సీ వైఎస్ వివేకానందరెడ్డి, మంత్రి గల్లా అరుణకుమారి, పలువురు సీనియర్ నాయకులు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. విజయలక్ష్మికి మద్దతుగా భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, హితులు, సన్నిహితులు పులివెందులకు చేరుకున్నారు.
నామినేషన్ కార్యక్రమం పూర్తయిన తర్వాత వైఎస్ జగన్ ప్రసంగించకుండానే కార్యకర్తలకు, అభిమానులకు అభివాదం చేస్తూ వెళ్ళారు. ఇదిలావుండగా, విజయలక్ష్మి నామినేషన్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు వీలుగా పోలీసులు భారీ సంఖ్యలో నియమించారు.
|